సెప్టెంబర్ 21... వాల్డ్ అల్జీమర్స్ డే. అల్జీమర్స్ వ్యాధి బారినపడ్డవారి వయస్సు పెరుగుతున్నకొద్దీ ఒక్కో అవయవం పనిచేయకుండా పోతుంది. ఎప్పుడైతే మెదడు ఇలా మొద్దుబారిపోతుందో, పనిచేయడం ఆగిపోతుందో అప్పుడే గత జ్ఞాపకాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఫోన్ మెమొరీని డిలిట్ చేసినట్టు. అంటే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఏం జరిగిందో ఏమీ గుర్తుండదు. ఎవరైనా గుర్తు చేసినా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం కష్టం. ఈ పరిస్థితినే అల్జీమర్స్ అంటారు. అల్జీమర్స్ మెదడుకు సంబంధించిన సమస్య. ఈ వ్యాధిబారినపడ్డవారు మౌనంగా ఉండిపోతారు. మాట్లాడటం కూడా కష్టం. ఏవైనా చిన్నచిన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు తప్ప... గతంలో ఉన్నంత యాక్టీవ్గా మాత్రం కనిపించరు. ఈ వ్యాధి వృద్ధాప్యంలోనే వస్తుంది. కంటి చూపు మందగించడం, సరిగ్గా వినిపించకపోవడం లాంటి సమస్యలు వృద్ధాప్యంలో రావడానికి కారణం ఆ వయస్సులో ఆ అవయవాలు పనిచేయకపోవడమే. మెదడు కూడా అంతే. వయస్సు పెరిగాక పనిచేయడం తగ్గిపోతుంది. అల్జీమర్స్ వృద్ధుల్లోనే వస్తుంది. ఈ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉంది. సిగరెట్, మద్యం తాగేవారిలో రక్తనాళాలు దెబ్బతిన్నా కూడా అల్జీమర్స్ బారినపడే అవకాశముంది. అల్జీమర్స్ అంటే సాధారణంగా వచ్చే మతిమరుపు కాదు. దీని లక్షణాలు వేరేలా ఉంటాయి. అల్జీమర్స్ లక్షణాలను ముందే గుర్తించి జాగ్రత్తపడటం అవసరం. అల్జీమర్స్ లక్షణాలను ఇలా గుర్తించాలి. అనేక విషయాల్ని మర్చిపోతుంటారు. వ్యక్తుల్నీ గుర్తుపట్టలేరు. ఏదైనా విషయాన్ని సరిగ్గా గుర్తుంచుకోలేరు. బంధువుల్ని, స్నేహితుల్ని, పరిచయస్తుల్ని కూడా గుర్తుపట్టనంత మతిమరుపు వస్తుంది. సరిగ్గా మాట్లాడలేరు. మాటల్లో తడబాటు వస్తుంది. ఒక్కోసారి స్నానం చేయడం, తినడం, లాంటివి కూడా మర్చిపోతుంటారు. వేళకు ట్యాబ్లెట్లు వేసుకోవడం కూడా గుర్తుండదు. రోజులు, వారాలు, తేదీల్లాంటివీ గుర్తుండవు. చిన్నచిన్న లెక్కలు కూడా చేయలేరు. పేపర్, పుస్తకాల్లాంటివి కూడా చదవలేరు. ఏ మాటలైతే గుర్తుంటాయో... వాటినే పదేపదే పలుకుతుంటారు. మనస్తత్వంలో మార్పులు వస్తాయి. అయోమయానికి గురవుతుంటారు. భయపడుతుంటారు. అందర్నీ అనుమానిస్తుంటారు. ఏరోజు జరిగిన విషయాలు ఆరోజు మర్చిపోతుంటారు. ఇలా అల్జీమర్స్ తీవ్రమయ్యే కొద్దీ చివరకు నడవడం కూడా మర్చిపోతుంటారు. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తపడాలి. వెంటనే న్యూరాలజిస్ట్ను కలవాలి. అది సాధారణ మతిమరుపా? లేక అల్జీమర్సా? అన్నది నిర్థారించుకోవచ్చు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ ద్వారా అల్జీమర్స్ నిర్థారించుకోవచ్చు. మొదటి దశలోనే చికిత్స అందిస్తే అల్జీమర్స్ వ్యాధి తీవ్రం కాకుండా జాగ్రత్తపడొచ్చు. మందులతో ఈ వ్యాధిని నయం చేయొచ్చు. అల్జీమర్స్ వచ్చినవారి విషయంలో కుటుంబసభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలి. అల్జీమర్స్ వ్యాధి వచ్చినవారిని ఒంటరిగా వదిలిపెట్టకూడదు. వారిని ఒంటరిగా ఎక్కడికీ పంపించకూడదు. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల్ని తరచూ మాట్లాడిస్తుండాలి. వారి మెదడు యాక్టీవ్గా పనిచేసేలా ప్రోత్సహిస్తుండాలి. పుస్తకాలు చదివించాలి. టీవీలో ఏవైనా కార్యక్రమాలు చూడమని చెప్పాలి. బోర్డ్ గేమ్స్, పజిల్స్ ఆడిస్తూ మెదడుకు పని కల్పిస్తూ ఉండాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తినిపించాలి. పలు రకాల ధాన్యాలు, డ్రైఫ్రూట్స్, ఆకుకూరలు తప్పనిసరి.
Source : https://telugu.news18.com/
No comments:
Post a Comment